‘ఆడుదాం-ఆంధ్రా’ క్రీడా పోటీల ముగింపు వేడుకలకు వైఎస్ జగన్

  • ఈ నెల 6న విశాఖలో క్రీడా పోటీలు ప్రారంభం
  • 10న వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం
  • పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 10న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 6 నుంచి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘ఆడుదాం-ఆంధ్రా’ పోటీలు ప్రారంభం కానున్నాయి. 10న వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి జగన్ హాజరవుతారు. ఆడుదాం ఆంధ్రా పోటీల్లో ఏపీలోని ఒక్కో జిల్లా నుంచి కనీసం 130 మంది చొప్పున రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు.

కాగా, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో రూ. 1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున తెలిపారు. ఇప్పటికే పలు పనులు పూర్తయినట్టు పేర్కొన్నారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు 14 వేల మంది సిబ్బంది హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.

YS Jagan
Visakhapatnam
Adudam Andhra

More Telugu News